కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
:శిశువు మృతి.
:కుటుంబ సభ్యుల ఆవేదన.
Mbmtelugunews//కామారెడ్డి,జనవరి 09 (ప్రతినిధి ముజీబ్)
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో శిశువు జన్మించిన కాసేపటికే మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ మండల కేంద్రానికి చెందిన భవానికి బాన్సువాడ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిలుతో గతంలో వివాహమైంది.భవానికి బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు.పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు.కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్నా వినిపించుకోలేదు.నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది.

మొదటి కాన్పులో మహాలక్ష్మి పుట్టిందని సంతోషించే లోపే శిశువు మృతి చెందింది.దీంతో కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు.తాము చెప్పినట్టుగా బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బతికేదని,వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డను చంపేశారని ఆరోపించారు.తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.