తెలంగాణ,జనవరి 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని అన్నారు. తాత్కాలికంగా హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వద్దని ఇరిగేషన్ విభాగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని తదుపరి మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
గతంలో అధికారంలో ఉన్న వాళ్లు చేసిన తప్పులకు ఇప్పటికే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. సుమారు లక్షన్నర కోట్లతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు రిపేర్లకు ఎనిమిది, పది వేల కోట్లు అవసరమయితే ఖర్చుకు ఆలోచించాల్సింది లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రెండు మూడు రోజుల్లోనే వీరందరితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. తనతో పాటు ఇరిగేషన్ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొంటామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుంగిన ఫిల్లర్లను రిపేర్లు చేయిస్తే సరిపోతుందా.. లేదా ఉన్నవి తొలిగించి కొత్తవి కట్టాలా.. కొన్నింటిని రిపేర్లు చేసి కొన్నింటిని కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా… అనేది ఈ కమిటీ తో సమగ్రంగా అధ్యయనం చేయిస్తామన్నారు.
కృష్ఱా జలాల్లో మన రాష్ట్ర నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణ జలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు… కేఆర్ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామని సీఎం అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు.. అప్పుడేం చర్చలు జరిగాయి.. ఏమేం నిర్ణయాలు జరిగాయో.. వాటన్నింటిపై అఖిల పక్ష సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనల్లో నిజమెంత.. అప్పుడు నిర్ణయాలు తీసుకున్నదెవరు.. వాటన్నింటినీ ప్రజల ముందు ఉంచాలని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగే సలహాలు సూచనలు తప్పకుండా ప్రభుత్వం స్వీకరిస్తుందని స్పష్టం చేశారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పగించినట్లు వస్తున్న ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏ ప్రాజెక్టు అప్పగించలేదని, ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. ’కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 45 రోజులైందని, ఈ కొద్ది రోజుల్లోనే ఎప్పుడు కృష్ణా బోర్డుతో మీటింగ్లు జరిగాయి.. ఎవరు హాజరయ్యారు.. ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు..? మాకు తెలియకుండా అధికారులేమైనా నిర్ణయాలు తీసుకున్నారా…? మీ విభాగం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు..’ అంటూ ఇరిగేషన్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక రాజకీయ పార్టీగా రాజకీయ విమర్శలు చేయడం వేరు.. శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి. కృష్ణా జలాల్లో ఎంత వాటా ఉందో వాళ్లకు తెలియదా..? వాటాకు మించి నీటిని తోడుకుపోతుంటే పదేండ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో.. అఖిల పక్ష సమావేశంలో చర్చకు పెడుదామని సీఎం అన్నారు.
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను వందశాతం పూర్తి చేయాల్సిందేనని అన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.



