విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి: సులోచన రాణి
Mbmtelugunews//నడిగూడెం, ఆగష్టు 01(ప్రతినిధి మాతంగి సురేష్): విద్యార్థులు క్రమశిక్షణతో నిత్యం కళాశాల తరగతులకు హాజరవుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సులోచన రాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం నడిగూడెం కెఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ప్రభుత్వం కల్పించిన వసతులను అధ్యాపకుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం త్వరలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుందని కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ కళాశాలకు ఏమాత్రం తీసి పోనీ విధంగా అన్ని ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కళాశాల అధ్యాపకులచే ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని మారిన సిలబస్ ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సైన్స్ ప్రయోగ పరీక్షలు ఉన్నందున వాటిపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 187 మంది విద్యార్థులను నమోదు చేసినందుకు ప్రిన్సిపల్ అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వారంలో అడ్మిషన్లు 200 మార్క్ దాటాలన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డి విజయ నాయక్, అధ్యాపకులు శ్రీధర్, కృష్ణ, మహేష్, వీరన్న, ఈశ్వర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.



