Saturday, September 12, 2026
[t4b-ticker]

పరిశుభ్రతే నగర నాగరికతకు తొలి చిరునామా

పరిశుభ్రతే నగర నాగరికతకు తొలి చిరునామా

:ప్రతి అరకిలోమీటరుకు వ్యర్థాల సేకరణ
కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

:వాణిజ్య భవనాల్లో మహిళా మరుగుదొడ్లు తప్పనిసరి చేయాలి.

:పట్టణ పరిశుభ్రత, మహిళల సౌకర్యాలపై ‘జీరో టాలరెన్స్‌’ విధానం అవసరం.

:కోర్‌ అర్బన్‌ రీజియన్‌ బిల్లుపై కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీ రెడ్డి.

Mbmtelugunews//హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12(ప్రతినిధి మాతంగి సురేష్) : పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి అరకిలోమీటరుకు వ్యర్థాల సేకరణ కేంద్రాలు నెలకొల్పాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీ రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించే షాపింగ్‌ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను తప్పనిసరి చేయాలని కోరారు. శనివారం రాష్ట్ర శాసనసభలో ‘కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) బిల్లు–2026’పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై కార్యాచరణ, లింగ సమానత్వం, సార్వత్రిక ప్రాప్యత, సమ్మిళిత పట్టణ రూపకల్పన, ట్రాఫిక్‌ నిర్వహణ వంటి అంశాలతో సమగ్ర కార్యాచరణ వ్యవస్థను ప్రతిపాదించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. వీటితోపాటు ఘన వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఒక నగరంలోకి ప్రవేశించే వారికి మొదట కనిపించే పరిసరాలే ఆ నగరంపై తొలి అభిప్రాయాన్ని కలిగిస్తాయని పద్మావతి రెడ్డి అన్నారు. పరిశుభ్రమైన రహదారులు, క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే పౌర సదుపాయాలు నగర అభివృద్ధికి ప్రధాన సూచికలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఘన, జీవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, నిర్మాణ పనుల ద్వారా శిథిల వ్యర్థాలు, ఆసుపత్రుల నుంచి జీవవైద్య వ్యర్థాలు, హోటళ్లు, వీధి ఆహార కేంద్రాల నుంచి ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. వాటి స్వభావానికి అనుగుణంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో తరలించి, సురక్షితంగా నిర్మూలించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనిషి ఉన్న ప్రతి చోటా ప్రతిరోజూ వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వ్యర్థాల నిర్వహణ అప్పుడప్పుడు చేపట్టే కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ నిరంతరాయంగా కొనసాగే వ్యవస్థగా ఉండాలి అని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రహదారుల పక్కన, పాదచారి మార్గాల మూలల్లో, ఖాళీ స్థలాల్లో చెత్తను పారవేస్తున్నారని చెప్పారు. కొద్దిరోజుల్లోనే అది భారీ చెత్త కుప్పగా మారి దుర్వాసన వెదజల్లడంతోపాటు వీధి కుక్కలు చేరడానికి కారణమవుతోందన్నారు. దీనివల్ల ప్రజారోగ్యంతోపాటు నగర పర్యావరణం, సౌందర్యం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర రూపకర్తలు, ఆర్కిటెక్టుల సహకారంతో ప్రతి అరకిలోమీటరుకు ఒక వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాలు సాధారణ చెత్త కుండీల మాదిరిగా కాకుండా నగర సౌందర్యంలో భాగంగా కనిపించేలా ఆకర్షణీయంగా, శాస్త్రీయంగా రూపకల్పన చేయాలన్నారు. ప్రజలు నడిచి వెళ్లగలిగే దూరంలో వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఉంటే ఎక్కడపడితే అక్కడ చెత్త పారవేసే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు. పురపాలక సంస్థలకు వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ కూడా సులభతరం అవుతుందన్నారు. నగరం నివసించడానికి ఆరోగ్యకరంగా, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పట్టణ ప్రణాళికలో మహిళల అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పద్మావతీ రెడ్డి సూచించారు. మహిళలు బయటకు వచ్చినప్పుడు సురక్షితమైన మరుగుదొడ్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇంటికి చేరేవరకు కనీస సౌకర్యం అందుబాటులో లేకపోవడం మహిళల ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించే ప్రతి షాపింగ్‌ కాంప్లెక్స్‌, వాణిజ్య భవనం, ఇతర ప్రజా వినియోగ భవనాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్డిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కనీసం ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో స్థలం కేటాయించడం భవన యాజమాన్యాలకు పెద్ద భారం కాదన్నారు. భవన నిర్మాణ అనుమతుల్లోనే దీనిని తప్పనిసరి నిబంధనగా చేర్చాలని, మరుగుదొడ్ల పరిశుభ్రత, నిర్వహణ బాధ్యతను సంబంధిత భవన యాజమాన్యానికే అప్పగించాలని సూచించారు. మహిళలకు మరుగుదొడ్ల ఏర్పాటు ఐచ్ఛిక సదుపాయంగా కాకుండా తప్పనిసరి పౌర అవసరంగా గుర్తించాలని కోరారు. మహిళల గౌరవం గురించి మాట్లాడటంతోపాటు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే నిజమైన సమ్మిళిత పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆచరణాత్మక పరిష్కారాలు రూపొందించాలని సూచించారు. కొత్తగా ఈ వ్యవస్థ పరిధిలోకి వచ్చిన 24 గ్రామాల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పునాది వేయాలన్నారు. అభివృద్ధి చెందని ప్రాంతాలకు సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడంతోపాటు ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళికా నిపుణుల సహకారంతో పరిష్కారాలు కనుగొనాలని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ, మహిళా మరుగుదొడ్లు, పర్యావరణ పరిరక్షణ, సార్వత్రిక ప్రాప్యత వంటి అంశాలను పట్టణ ప్రణాళికలో తప్పనిసరిగా పొందుపరిస్తే నగర జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పు వస్తుందని ఉత్తమ్‌ పద్మావతీ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular