ఉత్తమ ప్రధానోపాధ్యాయులకు ఘన సన్మానం
Mbmtelugunews //కోదాడ, సెప్టెంబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్):మండలం పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచి మందుల నాగయ్య అధ్యక్షతన రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన ఎండీ సలీం షరీఫ్ ని, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన విమలా కుమారిల సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఇర్లా నరసింహారెడ్డి లతో కలిసి సర్పంచ్ నాగయ్య సన్మాన గ్రహీతలను ఘనంగా సత్కరించాడు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య మాట్లాడుతూ.. గుడిబండ గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు ముందుండి గ్రామంలోని ఉన్నత పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎండీ సలీం షరీఫ్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందాల్సిన విద్యా సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజన పథకం తదితర కార్యక్రమాలు సక్రమంగా అమలు అయ్యేలా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అలాగే గుడిబండ గ్రామ అభివృద్ధికి, విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



