విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
Mbmtelugunews//కోదాడ, జూన్ 26(ప్రతినిధి మాతంగి సురేష్) : విద్యార్థి జీవితంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తద్వారా తమ ఆరోగ్యాన్ని, జీవితాన్ని కాపాడుకోవాలని కోదాడ డీ ఎస్ పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ లో మత్తు పదార్థాలు — వాటి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక దశ అని, ఈ సమయంలో విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా చదువుపై దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

మత్తు పదార్థాల వినియోగంతో విద్యార్థి జీవితమే నాశనం అవుతుందన్నారు. ఇటీవలి కాలంలో యువత, విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నదని, దాన్ని అరికట్టేందుకు పోలీసు శాఖ కు సహకరించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ లు సుధీర్ కుమార్, అంజిరెడ్డి, మల్లేష్, కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, అకడమిక్ డీన్ నటరాజ్, పీఆర్వో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.



